భద్రాచల క్షేత్రం లో సీతారాముల కల్యాణం నేత్ర పర్వం

భద్రాచలం స్టూడియో భారత్ ప్రతినిధి

Apr 17, 2024 - 17:25
Apr 19, 2024 - 14:35
 0  15
భద్రాచల క్షేత్రం లో సీతారాముల కల్యాణం నేత్ర పర్వం

భద్రాచల క్షేత్రంలో శ్రీరామ నవమి వేడుకలు వాడవాడలా ఘనంగా నిర్వహించారు. భద్రాచల క్షేత్రంలో సీతారాముల కల్యాణం నేత్రపర్వంగా సాగింది.తెల్లవారు జామునే ఆలయ ద్వారాలను తెరిచి అర్చకులు.. రామయ్యకు సుప్రభాత సేవ జరిపారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు,మంగళ శాసనం, అభిషేకం ఆ తర్వాత ధ్రువమూర్తులకు కల్యాణం నిర్వహించారు.తర్వాత కల్యాణ మూర్తులను పల్లకీలో ఉంచి మంగళ వాయిద్యాల మధ్య మిథిలా మైదానంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేశారు.

ప్రభుత్వ తరుపున సీఎస్ పట్టు వస్త్రాల సమర్పణ

కల్యాణం సందర్భంగా సీతారామచంద్రస్వామి వారలకు ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పట్టువస్త్రాలు,ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. రజత సింహాసనంపై సీతారామచంద్ర స్వాములను ఆసీనులను చేశారు. తిరువారాధన, విశ్వక్సేన పూజ,పుణ్యహావచనం నిర్వహించి మండప శుద్ధి చేశారు. 'యుంజానహః ప్రథమం' అనే మంత్రాని పఠిస్తూ వేద పండితులు ప్రజా సంపతర్థ్యం 'శ్రీయం ఉద్వాః హిష్షే' అన్న సంకల్పంతో స్వామి వారికి ఎదురుగా సీతమ్మను కూర్చోబెట్టి కన్యావరణలు జరిపారు.మోక్షబంధం,ప్రతిసర బంధనం,ద్వితీయ సువర్ణ యజ్ఞోపవీత ధారణ గావించారు.

అంగ రంగ వైభవంగా కల్యాణం

వధూవరుల వంశ గోత్రాలకు సంబంధించి ప్రవరలు వినిపించారు. అనంతరం ఆశీర్వచనం, పాద ప్రక్షాళన, పుష్పాదక స్నానం జరిపి వరపూజ కార్యక్రం జరిపారు.కల్యాణం సందర్భంగా సంప్రదాయబద్ధంగా భక్తరామదాసు చేయించిన పచ్చల పతకం, చింతాకు పతకం,కలికితురాయి, రామమాడ తదితర ఆభరణాలను రామయ్యకు, సీతమ్మకు, లక్ష్మణ స్వామికి ధరింపజేశారు. అర్చక స్వాములు స్వామి వారికి నూతన వస్త్రాలను అలంకరించారు. అభిజిత్‌ లగ్నం సమయంలో సీతారాముల ఉత్సవమూర్తుల శిరసుపై జీలకర్రబెల్లం ఉంచి.. అనంతరం భక్తరామదాసు చేయించిన మంగళ సూత్రాలతో సూత్రధారణ, తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు.భారీగా తరలి వచ్చిన భక్తులు కల్యాణ వేడుకలో వేలాది మంది భక్తులు వీక్షించి పరవశించి పోయారు.కల్యాణం జరిగిన మిథిలా మైదానంతో ఆలయ పరిసరాలన్నీ రామనామస్మరణతో మార్మోగాయి. కల్యాణ వేడుక సందర్భంగా మిథిలా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం పట్టాభిషేక కార్యక్రమం జరుగనున్నది. కల్యాణోత్సవంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టీస్ పీఎస్‌ నరసింహా, హైకోర్ట్ జడ్జి భీమపాక నగేష్రా రామయ్య కల్యాణాన్ని వీక్షించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow