తెలంగాణ ఎన్నికలపై ఏపీ లో జోరుగా బెట్టింగులు!
స్పెషల్ స్టోరీ..... స్టూడియో భారత్ ప్రతినిధి

తెలంగాణ ఎన్నికలపై ఏపీలో జోరుగా బెట్టింగులు!
తెలంగాణలో ప్రధాన పార్టీలు,ప్రముఖుల జయాపజయాలపై ఏపీలో జోరుగా పందేలు..
హైదరాబాద్:
భారాస హ్యాట్రిక్ కొడుతుందా.. కాంగ్రెస్కు ఓ ఛాన్స్ వస్తుందా..
భాజపా జెండా ఎగురుతుందా.. ఎన్నికల వేళ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ నలుగురు కలిసినా ఇప్పుడు ఇదే చర్చ. అయితే తెలంగాణలో ఎన్నికల ఫలితాలతో పాటు, ప్రముఖుల జయాపజయాలపై ఆంధ్రప్రదేశ్లో రూ.వందల కోట్ల మేర పందేలు (బెట్టింగులు) కాస్తున్నారు. ఈ మేరకు రంగంలోకి దిగిన దళారులు వాట్సప్ గ్రూప్లు రూపొందించి వీటిని నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీలన్నీ పోటాపోటీగా తలపడుతుండటంతో ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకునేందుకు క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులూ రంగంలోకి దిగారు.
కీలక నియోజకవర్గాలపై..
తెలంగాణలో ప్రముఖులు బరిలో నిలిచిన నియోజకవర్గాలపై అధికశాతం పందేలు జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఉప్పల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్తోపాటు రాష్ట్రంలోని కరీంనగర్, సూర్యాపేట, హుజూరాబాద్, దుబ్బాక, గజ్వేల్ తదితర నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములపై 1:5 (రూ.100కి 500) చొప్పున పందేలు కాస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలు బరిలో నిలిచినచోట వారికి వచ్చే మెజార్టీలపై 1:10 (రూ.100కి వెయ్యి) అంటూ దళారులు ఊరిస్తున్నారు.
ఏపీలోని పశ్చిమగోదావరి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు ప్రాంతాలకు చెందిన క్రికెట్, కోడి పందేల నిర్వాహకులు తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించారు. ఐపీఎల్, ప్రపంచకప్ క్రికెట్లో పందెం కాసి నష్టపోయిన వారిని ఏజెంట్లుగా మార్చుకొని దందా ప్రారంభించారు.భీమవరం ప్రాంతానికి చెందిన ఓ రొయ్యల చెరువు వ్యాపారి శేరిలింగంపల్లిలో విజయం సాధించబోయే పార్టీపై రూ.కోటి పందెం కాసినట్లు విశ్వసనీయ సమాచారం. గెలిస్తే రూ.5 కోట్ల లాభం, ఓడితే రూ.కోటి నష్టం అంటూ ఖాళీ బ్యాంకు చెక్కులను దళారుల చేతికి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్లో మూడు ప్రధాన పార్టీల గెలుపోటములు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులకు వచ్చే మెజార్టీలపై కూడా స్థానికంగా పందేలు కాస్తున్నారు..
తెలంగాణలో తదుపరి సీఎం ఎవరు అన్న విషయమై కూడా బెట్టింగులు జరుగుతున్నాయి.భారాస నెగ్గితే మూడోసారి కేసీఆర్ సీఎం అవుతారు.అయితే హస్తం పార్టీ మెజార్టీ సీట్లు సాధిస్తే ముఖ్యమంత్రి ఎవరు? ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు, సీనియర్లపైనా పందేలు కాస్తున్నట్లు సమాచారం. గుంటూరు జిల్లాకు చెందిన ఓ ప్రధాన పార్టీ నాయకుడి కనుసన్నల్లో ఇప్పటికే ఏజెంట్లు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది..
భారాస-కాంగ్రెస్ జయాపజయాలపైనే ఎక్కువగా పందేలు
జరుగుతున్నాయని హైదరాబాద్కు చెందిన ప్రధాన పార్టీ నాయకుడు ఒకరు తెలిపారు. ముంబయి, దిల్లీకి చెందిన బెట్టింగ్ ముఠాలు కూడా తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించినట్లు తెలుస్తోందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.రాష్ట్రంలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని యాప్లు, వాట్సప్ గ్రూపుల ద్వారా లావాదేవీలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రూ.100కు రూ.5,000-6,000 లాభాలు వస్తాయని ఊరిస్తూ కూడా పెద్దఎత్తున వసూలు చేయడం ఈ ముఠాల ప్రత్యేకత. పందెంలో గెలిచిన వారికి ఇవ్వాల్సిన సొమ్ములో కమీషన్లు వంటివాటి పేరిట సగం కొట్టేస్తారని ఆ అధికారి వివరించారు..
What's Your Reaction?






